అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ప్రజలను బలవంతం చేయాలా?
ఇటీవల అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలు, ఓ రైతు మరణం చుట్టూ నడిచిన ప్రచారం, భిన్న అభిప్రాయాలపై వ్యక్తమైన ప్రతిస్పందనలు మరోసారి ఈ ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. రాజధాని పేరుతో సాగుతున్న రాజకీయాలు, మీడియా కథనాలు, ప్రజాస్వామ్య విలువలపై ఇప్పుడు తీవ్ర చర్చ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి ఒకే కోణమా

ఒకే కథనం… అదే నిజమా? రెండో కోణం చెప్పకూడదా?
దశాబ్దాలుగా కొన్ని మీడియా సంస్థలు చెప్పిందే నిజం… రాసిందే వార్త… మిగతావన్నీ అబద్ధాలనే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక వ్యక్తిని అవసరమైనప్పుడు దేవుడిలా చూపించడం… రాజకీయ సమీకరణాలు మారగానే అదే వ్యక్తిని విలన్గా మార్చేయడం… ఇదే రాజకీయ మీడియా మాయాజాలమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ప్రజలు ప్రశ్నించకూడదు… పోల్చకూడదు… రెండో కోణం తెలుసుకోవాలనుకోకూడదు… ఇదే అసలు ప్రమాదకర ధోరణి కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
భూములు ఇచ్చినప్పుడు త్యాగమూర్తులు… న్యాయం అడిగితే స్వార్థపరులా?
రాజధాని కోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చినప్పుడు వారిని “త్యాగమూర్తులు”గా కొనియాడారు.
కానీ అదే రైతులు…
“మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి…”
“ముందు మాకు న్యాయం చేయండి…”
అని అడిగితే వారి ఆవేదనపై ఎందుకు చర్చ జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో ఓ రైతు ప్రజల ముందే తన బాధను చెప్పుకుని కుప్పకూలి మరణించిన ఘటనపై కూడా అసలు సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి ఒకే కోణమా
రాజధాని అందరిదా… లేక కొందరిదేనా?
అమరావతిలోకి ఎవరు రావాలి… ఎవరు రాకూడదు… ఎవరు మాట్లాడాలి… ఎవరు మౌనంగా ఉండాలి…
ఇవన్నీ నిర్ణయించే హక్కు ఎవరికుంది?
భిన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారిని బెదిరించడం… దాడులు చేయడం… మళ్లీ ఇక్కడికి రావద్దని హెచ్చరించడం వంటి ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని విమర్శకులు చెబుతున్నారు.
రాజధాని అనేది మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్ముతో నిర్మించేది. అలాంటప్పుడు అది ఒక్క వర్గానికి మాత్రమే చెందిన ఆస్తిలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమరావతి ఒకే కోణమా
రెండో కోణాన్ని ఎందుకు దాచేస్తున్నారు?
అమరావతి అంటే కేవలం ఒక వర్గం కథనా?
భూములు ఇవ్వని రైతుల సమస్యలు లేవా?
భూములు ఇచ్చిన రైతులకు హామీలు నెరవేరాయా?
రెండో దశ భూసేకరణపై స్థానికుల అభిప్రాయాలు ఏమిటి?
ఈ ప్రశ్నలు అడిగితే ఎందుకు అసహనం వ్యక్తమవుతోందని విమర్శిస్తున్నారు.
ఒకే కథనం వినిపించే సమాజం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
అమరావతి ఒకే కోణమా
మీడియా ప్రజల గొంతుకా… లేక అధికారానికి ఉంపుడుగత్తెనా?
మీడియా పని అధికారాన్ని ప్రశ్నించడం.
ప్రజల బాధలను వెలుగులోకి తీసుకురావడం.
విభిన్న అభిప్రాయాలకు వేదిక కావడం.
కానీ కొందరు విమర్శకుల అభిప్రాయం ప్రకారం… ప్రస్తుతం కొన్ని వేదికలు ప్రజల గొంతుకగా కాకుండా అధికారానికి అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
ఒకే కోణాన్ని చూపిస్తూ మిగతా వాదనలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు చెబుతున్నారు.
అమరావతి ఒకే కోణమా
ఇది ఈనాడు కాలం కాదు… ఇంటర్నెట్ కాలం!
ఒకప్పుడు వార్తలను నియంత్రించడం సులభం.
ఇప్పుడు కాదు.
సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫార్ములు, స్వతంత్ర మీడియా వల్ల ప్రతి సంఘటనకు మరో కోణం కూడా ప్రజల ముందుకు వస్తోంది.
అందుకే ప్రజలు ఇప్పుడు ఒకే కథనాన్ని నమ్మే పరిస్థితిలో లేరు.
ప్రతి విషయాన్నీ పరిశీలిస్తున్నారు… పోల్చి చూస్తున్నారు… ప్రశ్నిస్తున్నారు.
అమరావతి ఒకే కోణమా
చివరి మాట… రెండో కోణం వినిపించే రోజే ప్రజాస్వామ్యం గెలుస్తుంది!
అమరావతి అంశం కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించినది మాత్రమే కాదు… అది రైతుల నమ్మకం, ప్రజాస్వామ్య హక్కులు, మీడియా బాధ్యత, రాజకీయ నైతికతలతో ముడిపడి ఉన్న అంశం.
ఒకే కథనాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగినా… రెండో కోణాన్ని పూర్తిగా దాచిపెట్టడం ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కాదు.
ప్రజాస్వామ్యంలో ప్రతి గొంతుక వినిపించాలి… ప్రతి ప్రశ్నకు సమాధానం రావాలి… ప్రతి రైతు ఆవేదన చర్చకు రావాలి. ఎందుకంటే రాజధాని ఎవరి సొంతం కాదు… రాష్ట్ర ప్రజలందరిది.
అమరావతి ఒకే కోణమా





