ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ఆపరేషన్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అటవీ శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏనుగుల కొనుగోలు, నిర్వహణ, పనితీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కుంకీ ఏనుగులు
ఏడాదిగా సరైన కుంకీ ఏనుగులు ఆపరేషన్ లేదనే ఆరోపణలు
కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు కుంకీ ఏనుగుల్లో ఒకటి గుడ్డిదిగా, మరొకటి పూర్తిస్థాయి ఆపరేషన్కు అనుకూలంగా లేకపోవడంతో అడవి ఏనుగుల నియంత్రణలో అవి సమర్థంగా పనిచేయలేకపోయాయని ప్రచారం జరుగుతోంది. దీంతో గత ఏడాది కాలంగా ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చు
ఈ ఏనుగుల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఆహారం, సంరక్షణ, వైద్య ఖర్చులు, శిక్షణ తదితర అంశాలపై కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతోందని ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఏడాదిలోనే కోటి రూపాయలకుపైగా ఖర్చు చేసినట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసమే తెచ్చారా?
ఈ కుంకీ ఏనుగులను తీసుకురావడంలో రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా పనిచేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం వీటిని తెచ్చారని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం అడవి ఏనుగుల నియంత్రణ కోసం అవసరమైన చర్యల భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి.
“కుంకీ ఏనుగులు ఆపరేషన్” పేరుతో కలరింగ్?
ఈ ఏనుగులు ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న విమర్శలు బయటకు రావడంతో, కొన్ని సందర్భాల్లో వాటిని కుంకీ ఆపరేషన్లలో పాల్గొన్నట్లు చూపిస్తూ ప్రచారం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి, రెండుసార్లు నిర్వహించిన కార్యక్రమాలను పెద్ద విజయాలుగా చూపించారనే విమర్శలు ఉన్నాయి.

కుంకీ ఏనుగులును తిరిగి కర్ణాటకకు పంపించే ప్రయత్నాలు?
ఏనుగుల నిర్వహణ భారంగా మారడంతో పాటు, ఆపరేషన్లలో సరైన ఫలితాలు లేకపోవడంతో వాటిని తిరిగి కర్ణాటకకు పంపించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారన్న సమాచారం వెలువడుతోంది. ముఖ్యంగా గుడ్డిదిగా ఉన్న ఏనుగును తిరిగి పంపించేందుకు ఇప్పటికే కర్ణాటక అధికారులతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
చివరకు కుంకీ ఏనుగుల వ్యవహారం ఎటు దారితీస్తుంది..?
భారీ అంచనాలతో తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు తలనొప్పిగా మారిందన్న చర్చ రాజకీయంగా వేడెక్కుతోంది. నిర్వహణ ఖర్చులు, ఆపరేషన్ల సామర్థ్యం, వాటి అవసరంపై ఇంకా వివాదం కొనసాగుతుండగా… ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.






