హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారా? రూ.600 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించండి.. చంద్రబాబు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకంపై తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక హామీలు అమలు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) తరఫున డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు మూడు పేజీల లేఖ పంపిస్తూ, ప్రభుత్వం మాట తప్పిందని, పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందని తీవ్రంగా ఆరోపించింది.
రాష్ట్రవ్యాప్తంగా 320కు పైగా సభ్య ఆస్పత్రులు పాల్గొన్న జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో స్పష్టం చేసింది.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు

ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ..? లేఖలో బయటపెట్టిన అసలు విషయాలు
ASHA లేఖ ప్రకారం, 2026 ఏప్రిల్లో ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్తో జరిగిన చర్చల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు స్పష్టమైన ఆర్థిక హామీలు ఇచ్చింది.
ప్రభుత్వం చేసిన హామీలు:
- ఒకేసారి రూ.1,000 కోట్ల వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) విడుదల చేస్తామని హామీ.
- ఆ తర్వాత ప్రతి నెల సుమారు రూ.170 కోట్లు క్రమం తప్పకుండా విడుదల చేస్తామని హామీ.
- మిగిలిన సుమారు రూ.1,000 కోట్ల బకాయిలను తదుపరి త్రైమాసికంలో చెల్లిస్తామని హామీ.
అయితే OTS మొత్తాన్ని కూడా ఆలస్యంగా విడుదల చేశారని, కానీ ప్రతి నెల రూ.170 కోట్ల చెల్లింపులు మాత్రం ఇప్పటివరకు అమలు కాలేదని లేఖలో తీవ్రంగా పేర్కొన్నారు.
“ప్రభుత్వం మాట తప్పింది”.. ఆస్పత్రుల తీవ్ర ఆరోపణ
లేఖలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాస్తవ అమలు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోపించాయి.
ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రులు:
- ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి,
- మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి,
- సర్జికల్స్, కన్స్యూమబుల్స్ సమకూర్చలేని పరిస్థితి,
- రోజువారీ నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్నాయి.
లక్షలాది మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చెల్లింపులు నిలిపివేసిందని ఆరోపించాయి.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
మరో షాక్.. HPR నమోదు లేకపోతే ఆగస్టు 10 నుంచి ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేత
ఇప్పటికే బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త షరతు తీసుకొచ్చిందని ASHA ఆరోపించింది.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి వచ్చిన సమాచారంలో,
HPR (Health Provider Registry) నమోదు పూర్తి చేయని ఆస్పత్రులకు 2026 ఆగస్టు 10 నుంచి ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేస్తామని పేర్కొన్నట్లు లేఖలో వెల్లడించింది.
నాణ్యతా ప్రమాణాలు పాటించడానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంస్కరణకు సహకరించామని పేర్కొంది.
అయితే,
బిల్లులు చెల్లించకుండా ఆర్థికంగా ఆస్పత్రులను కుదేలు చేసిన తర్వాత కొత్త నిబంధనల పేరుతో ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేయడం అన్యాయమని ఆరోపించింది.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
ప్రీ-ఆథరైజేషన్లు ఆగితే బాధపడేది రోగులేనని హెచ్చరిక
ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేస్తే ఆస్పత్రులు సేవలు అందించలేని పరిస్థితి వస్తుందని ASHA హెచ్చరించింది.
అది ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్ల కాదని…
ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడం వల్లే ఆ పరిస్థితి వస్తుందని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన రీయింబర్స్మెంట్ లేకుండా వైద్య సేవలను నిరవధికంగా కొనసాగించడం తమ వల్ల కాదని కూడా తెలిపింది.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
320 ఆస్పత్రుల జనరల్ బాడీ సమావేశం.. ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా 320కు పైగా సభ్య ఆస్పత్రులు పాల్గొన్న సమావేశంలో…
ప్రభుత్వం నుంచి సమయానికి నిధులు అందకపోతే ఇక ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించడం రోజు రోజుకు అసాధ్యంగా మారుతోందని తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆస్పత్రులు:
- వర్కింగ్ క్యాపిటల్ పూర్తిగా ఖర్చు చేస్తున్నాయని,
- ఉద్యోగుల జీతాలు చెల్లించలేకపోతున్నాయని,
- మందులు, కన్స్యూమబుల్స్ కొనుగోలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని,
- ఈ పరిస్థితిలో కూడా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించాయి.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
ప్రభుత్వం ముందు ASHA ఉంచిన 5 కీలక డిమాండ్లు
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం వెంటనే ఈ ఐదు నిర్ణయాలు తీసుకోవాలని ASHA డిమాండ్ చేసింది.
1. వెంటనే రూ.600 కోట్ల బిల్లులు విడుదల చేయాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ తక్షణమే రూ.600 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
2. నెలవారీ చెల్లింపులు క్రమం తప్పకుండా జరగాలి
ప్రతి నెల విడుదల చేస్తామని చెప్పిన రూ.170 కోట్ల చెల్లింపులను ఇకపై నిరంతరాయంగా విడుదల చేయాలని కోరింది.
3. మిగిలిన బకాయిలకు టైమ్లైన్ ప్రకటించాలి
ఇంకా చెల్లించాల్సిన పెండింగ్ మొత్తానికి స్పష్టమైన, కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని కోరింది.
4. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి
ASHA ప్రతినిధులతో ప్రభుత్వం, ట్రస్ట్ కలిసి తక్షణ అత్యవసర సమావేశం నిర్వహించి ఆచరణ సాధ్యమైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేసింది.
5. HPRతో ముడిపెట్టిన ప్రీ-ఆథరైజేషన్ నిలిపివేతను ఉపసంహరించాలి
ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు HPR నమోదు ఆధారంగా ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
“ప్రజల వైద్య సేవల కోసమే పోరాటం”.. ASHA
తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలన్నదే తమ ఉద్దేశమని ASHA స్పష్టం చేసింది.
అయితే…
ఎంపానెల్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సమయానికి విడుదల చేయకపోతే ఆరోగ్యశ్రీ పథకంలో పాల్గొనడం మరింత కష్టమవుతుందని లేఖలో హెచ్చరించింది.
రోగులు, ఆస్పత్రులు, మొత్తం ఆరోగ్య వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు
హామీలు ఇచ్చి మర్చిపోయిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరోగ్యశ్రీనే సంక్షోభంలోకి నెట్టిందా?
ప్రభుత్వం ఇచ్చిన రూ.1,000 కోట్ల OTS, ప్రతి నెల రూ.170 కోట్ల చెల్లింపులు, మిగిలిన బకాయిల విడుదల వంటి హామీలు అమలు కాలేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులే అధికారికంగా లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు బకాయిలు చెల్లించకుండా, మరోవైపు HPR నిబంధనల పేరుతో ప్రీ-ఆథరైజేషన్లు నిలిపివేస్తామని హెచ్చరించడం వల్ల లక్షలాది ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ASHA హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ లేఖపై ఎలా స్పందిస్తుంది? పెండింగ్ బిల్లులు విడుదల చేస్తుందా? లేక ఆరోగ్యశ్రీ సంక్షోభం మరింత ముదురుతుందా? అన్నది వేచిచూడాల్సి ఉంది.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రూ.600 కోట్ల బకాయిలు








