ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తించే ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందును తరలిస్తున్న 108 అంబులెన్స్ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోవడంతో తల్లి, బిడ్డ రెండు గంటల పాటు నరకయాతన అనుభవించిన సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చిత్తూరు 108 అంబులెన్స్ ఘటన

ఏమి జరిగింది?
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లెకు చెందిన జ్యోత్స్నకు ఏడో నెలలోనే పురిటి నొప్పులు రావడంతో ఆమెను అత్యవసరంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా, ఆమె 800 గ్రాముల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో రాత్రి 12.15 గంటల సమయంలో తల్లి, బిడ్డను 108 అంబులెన్స్లో తరలించడం ప్రారంభించారు.
చిత్తూరు 108 అంబులెన్స్ ఘటన
నడిరోడ్డుపై ఆగిపోయిన అంబులెన్స్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువును వెంటిలేటర్పై ఉంచి తీసుకెళ్తుండగా మురకంబట్టు సమీపంలో అంబులెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయింది. మరో అంబులెన్స్ను దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలేరు నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త అంబులెన్స్ వచ్చే వరకు తల్లి, పసికందు రెండు గంటల పాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సిన వైద్య సేవలే ఇలా మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై విమర్శలు
ఈ ఘటన తర్వాత ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు సరిగా పనిచేయడం లేదని ఆరోపణలు వస్తుండగా, ఇప్పుడు 108 అంబులెన్స్ల నిర్వహణలోనూ లోపాలు బయటపడుతున్నాయని ప్రజలు అంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు, అంబులెన్స్ల దుస్థితి వంటి అంశాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు.
“జనాభా పెంచండి” ముందు.. కనీస సౌకర్యాలు కల్పించండి!
మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తామని ప్రజలకు సందేశాలు ఇస్తున్న పాలకులు.. ముందుగా ఇప్పటికే ఉన్న ప్రజలకు కనీస వైద్య, విద్యా సౌకర్యాలు అందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్లే రోడ్డుపై ఆగిపోతే.. ప్రజలు ప్రభుత్వంపై ఎలా నమ్మకం ఉంచాలన్న ప్రశ్న ఇప్పుడు సామాన్యుల్లో వినిపిస్తోంది.
అర్థమైందా రాజా… ఇప్పుడు అయినా కళ్ళు తెరవాలి!
చిత్తూరు ఘటన ఒక్క కుటుంబం ఎదుర్కొన్న కష్టం మాత్రమే కాదు.. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన సంఘటనగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 108 సేవల నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
చిత్తూరు 108 అంబులెన్స్ ఘటన






