ఖరీఫ్ సీజన్లో పొలాల్లో ఉండాల్సిన రైతన్న.. ఇప్పుడు యూరియా కోసం ఆర్ఎస్కే కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. “డిజిటల్ సంస్కరణలు” అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానం రైతులకు వరం కాకుండా శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్ కాక, నెట్వర్క్ పనిచేయక గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు, దేవదాయ, అసైన్డ్, వక్ఫ్ భూముల్లో సాగు చేసే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
యూరియా కోసం రైతుల అగచాట్లు

‘డిజిటల్’ పేరుతో రైతన్నకు చుక్కలు చూపిస్తున్న యాప్
యూరియా కోసం ముందుగా యాప్లో బుకింగ్ తప్పనిసరి… తర్వాత ఓటీపీ… ఆ తర్వాత బయోమెట్రిక్ ధృవీకరణ… ఈ ప్రక్రియ పూర్తయితేనే ఎరువులు. కానీ గ్రామాల్లో నెట్వర్క్ లేక ఓటీపీలు రావడం లేదు. వేలిముద్రలు గుర్తించక రైతులు పలుమార్లు ప్రయత్నించాల్సి వస్తోంది. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కౌలు రైతులకు యాప్ అంటే అగ్నిపరీక్ష
భూమి తమ పేరులో లేకపోవడంతో కౌలు రైతులు యాప్ విధానంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవదాయ, అసైన్డ్, వక్ఫ్ భూముల్లో సాగు చేస్తున్న రైతులు కూడా అర్హత నిరూపణలో అవస్థలు పడుతున్నారు. సాగు చేస్తున్నది రైతే అయినా… యాప్ మాత్రం భూ రికార్డుల పేరుతో వారిని తిరస్కరిస్తోందని రైతులు వాపోతున్నారు.
యూరియా కోసం రైతుల అగచాట్లు
నెట్వర్క్ లేక ఎరువులు లేవు… ఇదేనా రైతు పాలన?
ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో ఓటీపీలు అందక రైతులు రోజులు తరబడి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాగు పనులు వదిలేసి యూరియా కోసం కార్యాలయాల ముందు కూర్చోవాల్సి వస్తోందని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
యూరియా కోసం రైతుల అగచాట్లు
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు… చూస్తూ ఊరుకుంటున్నారా?
ఒకవైపు యాప్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే… మరోవైపు కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
యూరియా కోసం రైతుల అగచాట్లు
జగన్ హయాంలో ఇంటి ముంగిటికే ఎరువులు… ఇప్పుడు యాప్ చుట్టూ చక్కర్లు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను నేరుగా రైతుల గ్రామాలకే, ఇంటి ముంగిటికే అందించే విధానం అమలైందని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకపోయిందని, బ్లాక్ మార్కెట్కు అవకాశం లేకుండా వ్యవస్థ పనిచేసిందని చెబుతున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు పేర్కొంటున్నారు. లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీలను ప్రభుత్వం భరించడం వల్ల ఒక్కో బస్తాపై రైతులకు రూ.20 నుంచి రూ.30 వరకు ఆదా కాగా, మొత్తం మీద రూ.100 కోట్లకు పైగా ప్రయోజనం కలిగిందని వెల్లడిస్తున్నారు.
యూరియా కోసం రైతుల అగచాట్లు
రైతు సంక్షేమమా… యాప్ సంక్షోభమా?
వ్యవసాయం అంటే సమయంతో పోటీ. విత్తే కాలంలో ఎరువులు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ రైతు అవసరాన్ని అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం… యాప్, ఓటీపీ, బయోమెట్రిక్ వంటి సాంకేతిక అడ్డంకులతో రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
యూరియా కోసం రైతుల అగచాట్లు
రైతన్నకు యాప్ కాదు… సకాలంలో యూరియానే కావాలి!
రైతు కోసం తెచ్చిన వ్యవస్థ… రైతునే ఇబ్బందులకు గురిచేస్తే దాని ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాప్ పేరుతో యూరియా పంపిణీ ఆలస్యమవడం, నెట్వర్క్ సమస్యలు, కౌలు రైతుల ఇబ్బందులు, ఎమ్మార్పీకి మించి అమ్మకాల ఆరోపణలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతన్నను క్యూల్లో నిలబెట్టే విధానానికి స్వస్తి చెప్పి, సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
యూరియా కోసం రైతుల అగచాట్లు







