శ్రీవారి దర్శనాలపై కొత్త వివాదం
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శన టికెట్ల కేటాయింపులపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఆయన ఆరోపణల ప్రకారం, వీఐపీ బ్రేక్ దర్శనాలు మరియు ప్రత్యేక ప్రవేశాల పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయల వ్యవహారం నడిచిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ఒక్క నిమిషంలోనే వందలాది టికెట్లు మాయమవుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూ టీటీడీ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు.
శ్రీవాణి ట్రస్ట్ 400 కోట్ల లూటీ

“లడ్డూ” సమయంలో గళమెత్తినవారు ఇప్పుడు ఎక్కడ..?
ఈ వివాదం మధ్య మరో రాజకీయ చర్చ కూడా మొదలైంది. గతంలో తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీ ఆరోపణల సమయంలో పెద్ద ఎత్తున స్పందించిన మీడియా వర్గాలు, సనాతన ధర్మ పరిరక్షకులు, రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
“పంది కొవ్వు” అంటూ రోజులు తరబడి చర్చలు చేసినవారు ఇప్పుడు శ్రీవారి సొమ్ము దోపిడీ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీవాణి ట్రస్ట్ 400 కోట్ల లూటీ
విశాఖలో సింహాచలం కొండ అంశం కూడా చర్చలోకి..
ఒకవైపు తిరుమల వ్యవహారం, మరోవైపు విశాఖలో సింహాచలం కొండ తవ్వకాలపై వస్తున్న ఆరోపణలు కలిపి ఇప్పుడు ధార్మిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దేవాలయాల పరిరక్షణపై మాట్లాడే వర్గాలు ఈ అంశాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయన్న ప్రశ్నలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆరోపణలా..? లేక రాజకీయ పోరాటమా..?
టీటీడీ, శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారిక విచారణలతోనే తేలాల్సి ఉంది. అయితే ఈ వివాదం మాత్రం భక్తుల్లో అనేక అనుమానాలకు కారణమవుతోంది. తిరుమల వంటి విశ్వాస కేంద్రం చుట్టూ వస్తున్న ప్రతి ఆరోపణ కూడా ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీయడం సహజమే.
శ్రీవారి పేరుతో రాజకీయాలు ఆగుతాయా..? నిజాలు బయటపడతాయా..?
శ్రీవారి పేరుతో నడిచే ప్రతి వ్యవహారంలో పారదర్శకత ఉండాలని భక్తులు కోరుతున్నారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే… తిరుమల ప్రతిష్ఠకు మచ్చ రాకుండా నిజాలు బయటకు రావాలన్నదే ఇప్పుడు అందరి ఆకాంక్ష.
శ్రీవాణి ట్రస్ట్ 400 కోట్ల లూటీ






